ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ ఇప్పటికీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోలేదని, ప్రజలనే తప్పుబడుతోందని విమర్శించారు. జీవన్ రెడ్డిని తెలంగాణకు వ్యతిరేకిగా అభివర్ణించిన కవిత, కేంద్రంపై బీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.రైతు బంధు, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆమె, అధికార-ప్రతిపక్షాలు ప్రజల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, సంస్థను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తామని ప్రకటించిన కవిత, యువతను పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
