ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి హోం మంత్రి కె. షణ్ముగంతో సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ లక్ష్యంగా ఈ భేటీ నిర్వహించారు.మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్లో నేరాల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలపై వారు ఆసక్తి వ్యక్తం చేశారు.కఠిన చట్టాలు, సమర్థవంతమైన పోలీసింగ్, ప్రజల్లో చట్టపరమైన అవగాహన వంటి అంశాలు నేరాల తగ్గుదలకు ఎలా దోహదపడుతున్నాయో తెలుసుకున్నారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న సీసీటీవీ నిఘా వ్యవస్థలు, టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేకంగా చర్చించారు. ఏపీలో కూడా ఇలాంటి ఆధునిక భద్రతా విధానాలను అమలు చేసే అవకాశాలపై మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు. నగరాల్లో నేరాలను తగ్గించేందుకు డిజిటల్ టెక్నాలజీ కీలకమని పేర్కొన్నారు.స్మార్ట్ సిటీ కాన్సెప్ట్, పారదర్శక పరిపాలన, ప్రజా భద్రతపై సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
