ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.సమాజానికి తీవ్రమైన హానికరంగా మారుతున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక్క శాఖకు పరిమితమైన సమస్య కాదని, సామాజిక సమస్యగా భావించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ రవి కృష్ణకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ, గంజాయి సాగు, రవాణాపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో సమన్వయం కోసం ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మకాలపై కఠిన నియంత్రణ అవసరమని పేర్కొంటూ, హోల్సేల్ మరియు రిటైల్ విక్రయాలపై ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాల వివరాలు ముందుగానే నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలల నుంచి కళాశాలల వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఎన్డీపీఎస్ కేసులు పెండింగ్లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. సమాజాన్ని, ముఖ్యంగా యువతను ఈ మత్తు పదార్థాల నుంచి కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు.
