హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం కేబినెట్లో ఉన్న అజారుద్దీన్ మంత్రి పదవిలో కొనసాగాలంటే ఏప్రిల్ 30లోపు శాసనమండలి సభ్యత్వం పొందాల్సి ఉంది. నిబంధనల ప్రకారం మంత్రి ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం అవసరం కావడంతో ఈ వ్యవహారం కీలకంగా మారింది. గవర్నర్ కోటాలో అజారుద్దీన్తో పాటు కోదండరాం పేర్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే అజారుద్దీన్పై గతంలో ఉన్న కొన్ని కేసులు నామినేషన్ ప్రక్రియకు అడ్డంకిగా మారినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ను కలిసి ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిర్ణయం ఆలస్యమైతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ‘ప్లాన్ బీ’ను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే అజారుద్దీన్తో రాజీనామా చేయించి, తిరిగి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం ద్వారా మరో ఆరు నెలల గడువు పొందే అవకాశం ఉందని సమాచారం.గవర్నర్ ఒకవేళ కోదండరాం పేరును మాత్రమే ఆమోదించి, అజారుద్దీన్ పేరును తిరస్కరిస్తే తదుపరి వ్యూహంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరగనుండగా, సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
