ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శ్రీసిటీ ప్రాంతంలో పరిశ్రమల ప్రతినిధులు, యాజమాన్యంతో నిర్వహించిన సమావేశంలో విద్యుత్ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా శ్రీసిటీ యాజమాన్యం కొల్లడం వద్ద నిర్మాణంలో ఉన్న 132/33 కేవీ ఉపకేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, క్యారియర్, పీజీ ఎలెక్ట్రోప్లాస్ట్ వంటి ప్రముఖ పరిశ్రమలు ఉత్పత్తి దశలోకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా అత్యవసరమని పేర్కొన్నారు.శ్రీసిటీ విస్తరణ దృష్ట్యా జపాన్ క్లస్టర్ సమీపంలో కొత్త ఉపకేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల ప్రతినిధులు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా పరిశ్రమలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. అదనపు ఉపకేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. గ్రీన్ టారిఫ్ ప్రోత్సాహకాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన విద్యుత్ వనరులను మెరుగుపరచడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
