ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తలేదని, ప్రస్తుతం ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని, రాబోయే రోజుల్లో ప్రజలే సరైన సమాధానం ఇస్తారని తలసాని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవించాలని సూచించిన ఆయన, ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా స్పందించిన తలసాని, వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమ్మె వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఉద్యోగ భద్రతపై సందేహాలు ఉన్నాయని, కార్మికులకు తగిన శిక్షణ ఇచ్చి వారిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
