ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూమికి గంగను తీసుకువచ్చిన భగీరథ మహర్షి తపస్సు, కృషి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం అవసరమని అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో మంచి విలువలను వ్యాప్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో జల వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా పోలవరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని చెప్పారు. సాగునీరు, తాగునీరు సమస్యలు తగ్గడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుందని వివరించారు.రాయలసీమ ప్రాంతంలో సాగునీటి విస్తరణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో రైతులకు లాభాలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జలధార వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ప్రాంతానికి తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు.నీటి సంరక్షణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి సవిత స్పష్టం చేశారు.
