ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను గాయని మంగ్లీ ఖండించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, కావాలనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు అన్యాయం జరిగిందని పేర్కొన్న మంగ్లీ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని తెలిపారు. చట్టంపై, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంటూ, నిజం తప్పకుండా వెలుగులోకి వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కేసులో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చట్టపరమైన మార్గంలోనే అన్ని విషయాలు స్పష్టమవుతాయని, న్యాయ ప్రక్రియను గౌరవిస్తానని వెల్లడించారు.ఇదిలా ఉండగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పి పలువురిని ఆకర్షించిన ఈ స్కీమ్పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రారంభంలో కొంతమందికి లాభాలు ఇచ్చి నమ్మకం కల్పించి, తర్వాత పెద్ద మొత్తాలు సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సంస్థ కార్యకలాపాలు ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగ్లీ పేరు బయటకు రావడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది.
