ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాన్ని వెలికి తీసి, మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు.లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జయరామ్ అనే వ్యక్తి కమీషన్ ఏజెంట్గా పనిచేస్తూ ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎక్కువ మంది పాల్గొంటే అధిక కమీషన్ పొందే విధంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1.75 లక్షల నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక పాత గుంటూరు ప్రాంతంలో రియాజ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఆఫ్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుంపును కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, రూ.75 వేల నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి బంతి, ఫోర్, సిక్స్ వంటి అంశాలపై కూడా పందాలు కాస్తున్నట్లు విచారణలో బయటపడింది.ఈ రెండు ఘటనల్లో కలిపి దాదాపు రూ.2 లక్షల నగదు, 13 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ప్రజలు బెట్టింగ్ మోజుకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
