ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, దీనిని “ప్రభుత్వ హత్య”గా అభివర్ణించారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు వంటి హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాడినా, ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ఇతర ఖర్చులను తగ్గిస్తేనే కార్మికులకు న్యాయం చేయవచ్చని సూచించారు.తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల ఎన్నికలకు నిధులు వెళ్తున్నాయని ఆరోపిస్తూ, ఆ ఖర్చులను నియంత్రిస్తే ఆర్టీసీ కార్మికులకు అవసరమైన వనరులు సమకూర్చవచ్చని బండి సంజయ్ పేర్కొన్నారు.ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
