ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్మికులు అధైర్యపడవద్దని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు కొనసాగిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసనలు వ్యక్తం చేయాలని, ఆవేశపూరిత చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడం సహజమేనని, అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యల వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని, నాయకులు సంయమనం పాటించాలని సూచించారు.ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కార్మికులు, ప్రభుత్వం మధ్య చర్చలు కీలక దశకు చేరుకోనున్న నేపథ్యంలో, సమస్యల పరిష్కారం ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
