ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కేసులో కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయి.ఈ సోదాలు హైదరాబాద్, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు నేతలు, అధికారులు, వ్యాపారవేత్తల ఇళ్లలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో రాజ్ కసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎం కార్యాలయానికి చెందిన కృష్ణమోహన్ రెడ్డి తదితరుల నివాసాలు ఉన్నాయి.ఈ లిక్కర్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించి కీలక అంశాలను వెలికితీసింది. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసింది.గతంలో ఈ కేసులో నిందితులు అరెస్టై ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. ఇప్పటికే వారి నుంచి ఈడీ స్టేట్మెంట్లు కూడా నమోదు చేసింది. తాజా సోదాల్లో అక్రమ ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించే దిశగా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.ఈ దాడులు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారగా, కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
