ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లాభాల్లో ఉన్న విద్యుత్ శాఖను దెబ్బతీశారని, పలుమార్లు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు.తిరుపతిలో ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. త్వరలోనే అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయిలో కొత్త నియామకాలు చేపడతామని వెల్లడించారు.పరిశ్రమల విస్తరణతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, దానికి అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని మంత్రి వివరించారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
