ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ వైఖరి కారణంగానే సమ్మె తీవ్రత పెరిగి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.సమ్మె నేపథ్యంలో కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం ఆందోళనకరమని, ముఖ్యంగా నర్సంపేటకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీ కార్మికులు ముందుగానే నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో కూడా ఇలాంటి సమస్యలపై బీజేపీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసిందని గుర్తుచేశారు.పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు అందించకపోవడం వంటి అంశాలు ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించిన రాంచందర్ రావు, బీజేపీ వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. అదే సమయంలో కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
