ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాబోయే 10 రోజుల్లో సమావేశాలు నిర్వహించి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.అమరావతిలో ఎన్డీయే కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు వివరించాలని సూచించారు.మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే వ్యతిరేకించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇతర పక్షాలు మద్దతు తెలిపినప్పటికీ కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును చట్టంగా మార్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు.ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రెస్మీట్లు నిర్వహించి ప్రజలకు వివరణ ఇవ్వాలని సూచించారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కూటమి నిర్ణయించింది.మొత్తంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ అంశం ప్రధాన చర్చగా నిలవనుంది.
