ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు వ్యక్తం చేసిన ప్రీతిరెడ్డి, బీజేపీ విధానాలపై సానుకూలంగా స్పందించడం వల్ల ఆమె పార్టీ మార్పుపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె బీజేపీ ఆఫీసుకు వెళ్లి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు.అయితే ఈ భేటీపై వస్తున్న ప్రచారాలకు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా మర్యాదపూర్వక సమావేశమేనని, రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మల్లారెడ్డి గ్రూప్లో ఏర్పాటు చేయనున్న ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని, అందుకే వివిధ పార్టీల నేతలను కలుస్తున్నామని తెలిపారు.బీజేపీలో చేరుతున్నానన్న వార్తలను ఖండించిన ఆమె, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే కార్యక్రమానికి సంబంధించి ఇతర పార్టీల నేతలను కూడా కలిసినట్లు వెల్లడించారు.ఇటీవల మల్లారెడ్డి కుటుంబం ప్రధాని మోదీని కలవడం, అలాగే గూగుల్తో కలిసి ఏఐ క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమవడం నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తంగా ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
