ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆరోపించారు.శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కవిత, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళనతో కార్మికులు సమ్మెకు దిగగా, ప్రభుత్వం సమ్మెను అణిచివేయడానికి చర్యలు చేపట్టిందని ఆమె విమర్శించారు.కార్మికుల ఆవేదనను భరించలేక శంకర్ గౌడ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న కవిత, చికిత్స పొందుతున్న సమయంలో ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన తనను ఆస్పత్రిలోకి అనుమతించలేదని ఆరోపించారు. ఆయన 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.ఈ ఘటనను “ప్రభుత్వ హత్య”గా అభివర్ణించిన కవిత, శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లైన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
