ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, లాభదాయకమైన పంటల వైపు దారి చూపించాలని అధికారులకు సూచించారు.ఏడాది పొడవునా పంటలు పండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ఒకే రైతు భూమిలో విభిన్న పంటలు సాగు చేసే విధానాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సమీక్షలో సీఎం కీలక మార్గదర్శకాలు ఇచ్చారు.ప్రకృతి సాగు ఉత్పత్తులకు సర్టిఫికేషన్ కల్పించి మార్కెట్లో మంచి ధరలు పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతు బజార్ల నుంచి నేరుగా వినియోగదారులకు సరఫరా చేసే డోర్ డెలివరీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని, కోకో పంట కోసం ప్రత్యేకంగా ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది రైతులకు అనుభవ కేంద్రంగా ఉపయోగపడేలా రూపొందించాలన్నారు. అరకు ప్రాంతంలో కుంకుమపువ్వు సాగును విస్తరించడంపై దృష్టి సారించాలని, అలాగే మష్రూమ్ ఉత్పత్తిని పెంచి వార్షికంగా లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతపురంలో ఆపిల్ సాగును విస్తరించే అవకాశాలపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు.అవకాడో, అంజీర్, జామ, పనస వంటి పంటల సాగును పెంచి వాటి విలువను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు జరగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా పేద రైతు కుటుంబాలకు డెయిరీ, పశుసంవర్థక రంగాల ద్వారా అదనపు ఆదాయం కల్పించేలా ప్రభుత్వ సహాయం అందించాలన్నారు. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
