ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్)లో త్వరలోనే ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలో ఈగల్ హెడ్క్వార్టర్స్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.రాష్ట్రంలో గంజాయి సాగును గణనీయంగా తగ్గించగలిగామని, భవిష్యత్తులో పూర్తిగా నిర్మూలించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.డ్రగ్స్ వినియోగించే వ్యక్తులు ఎక్కడి నుంచి సరఫరా పొందుతున్నారు, చెల్లింపులు ఎలా చేస్తున్నారు వంటి అంశాలపై లోతైన దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలో వేలాది డ్రగ్స్ కేసులు విచారణ దశలో ఉన్నాయని గణాంకాలతో సహా వివరించారు.ఈగల్ విభాగాన్ని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక దళాల మాదిరిగానే మరింత బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో ఈ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని డీజీపీ విశ్వాసం వ్యక్తం చేశారు.
