ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకప్పుడు విమర్శలకు గురైన ఈ ప్రాంతం ఇప్పుడు ఆధునిక నిర్మాణాలతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ మార్పుకు ప్రతీకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాస నిర్మాణం నిలుస్తోంది.గత ఏడాది ఏప్రిల్ 9న శంకుస్థాపన చేసిన సీఎం నివాసం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. మరికొన్ని నెలల్లో గృహప్రవేశం జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం నివాస గృహం మాత్రమే కాకుండా అధికార, ప్రజా కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోంది.సుమారు 25 వేల చదరపు గజాల్లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్లో పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్నారు.ఇక మౌలిక వసతుల పరంగా కూడా అమరావతి రూపురేఖలు మారుతున్నాయి. E6 ప్రధాన రహదారి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఐసిటి కేబుల్స్, గ్యాస్ పైప్లైన్లతో ఈ ప్రాంతం స్మార్ట్ ఇన్ఫ్రా హబ్గా మారుతోంది. ఒకప్పుడు వెలవెలబోయిన వెలగపూడి ప్రాంతం ఇప్పుడు ఆధునిక నిర్మాణాలతో కళకళలాడుతోంది. ఈ అభివృద్ధిపై స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా భూముల కొనుగోలు జరగడం, తమ ప్రాంతం అభివృద్ధి చెందడం గర్వకారణమని చెబుతున్నారు. అమరావతి భవిష్యత్తులో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయికి ఎదుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.
