అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న సంక్షోభానికి గత వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి కింజరాపు అచ్చానాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ గిట్టుబాటు ధరలు, సమయానికి విత్తనాలు, ఎరువులు, సాగునీటి సదుపాయాలు అందిస్తున్నదని తెలిపారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతులు అప్పులబారిన పడి, పంటలకు సరైన ధరలు దక్కక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఆ సమయంలో వ్యవసాయ రంగం క్షీణించిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం MSP అమలుతో పాటు ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటోందని తెలిపారు.2025–26 సంవత్సరానికి రూ.300 కోట్ల కేటాయింపులు ఉండగా, సుమారు రూ.588 కోట్లు ఖర్చు చేసి పలు పంటలకు మద్దతు అందించామని వివరించారు. పొగాకు, మామిడి, ఉల్లి, కోకో వంటి పంటలకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ఉల్లి పంట నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచి రైతులకు ఉపశమనం కల్పించామని తెలిపారు. అలాగే మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.గత వైసీపీ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరంగా ఉండగా, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 2025–26 నాటికి ఉత్పత్తి 237 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం వ్యవసాయ రంగంలో పురోగతికి నిదర్శనమని అన్నారు.ఉద్యాన రంగం, మైక్రో ఇరిగేషన్లో కూడా రాష్ట్రం ముందంజలో ఉందని, రైతులకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు విస్తరిస్తున్నామని మంత్రి అచ్చానాయుడు స్పష్టం చేశారు.
