ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రాయదుర్గం సత్త్వ నాలెడ్జ్ పార్క్లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ అవగాహన మరాథాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, యువత యోగా, వ్యాయామం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు.పొగాకు, గుట్కా వంటి హానికర పదార్థాల వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని మంత్రి హెచ్చరించారు. సమాజంలో అవగాహన పెంపు అత్యవసరమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ రమేష్ 5కే రన్ను, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు 2కే రన్ను ప్రారంభించారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రారంభ దశలోనే నోటి క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుందని తెలిపారు.మరాథాన్లో ఐటీ ఉద్యోగులు, వైద్యులు, యువతతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన పాల్గొనేవారు హాజరై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
