హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రారంభించిన ప్రజావాణి సేవలను మరింత విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్, తదుపరి మండల స్థాయికి విస్తరించాలని అధికారులకు ఆదేశించారు.ప్రజలు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా స్థానిక స్థాయిలోనే సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపిస్తూ నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు.ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో రియల్టైమ్ పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. ప్రతి స్థాయిలో నోడల్ అధికారులను నియమించి బాధ్యతలను స్పష్టంగా అప్పగించాలని సూచించారు.ఒక స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదులు ఆటోమేటిక్గా పైస్థాయికి వెళ్లే విధంగా వ్యవస్థను రూపొందించాలని, అవసరమైతే అప్పీల్ విధానాన్ని కూడా అమలు చేయాలని సీఎం చెప్పారు.ప్రజావాణి సేవలను వికేంద్రీకరించడం ద్వారా పెండింగ్ ఫిర్యాదులు తగ్గడమే కాకుండా, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
