ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): 2027 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా స్వీయ గణన కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆన్లైన్ పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.తెలంగాణ జనగణన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనాభా లెక్కలు కీలక ఆధారమని పేర్కొన్నారు. ఖచ్చితమైన గణాంకాలు లేకుండా సమర్థవంతమైన పాలన సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధికి ఇవి అవసరమని తెలిపారు.ఈసారి జనగణనలో డిజిటల్ సాంకేతికతను వినియోగించడం ద్వారా పారదర్శకత, వేగం, సామర్థ్యం పెరుగుతాయని కిషన్ రెడ్డి వివరించారు. 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణనకు అవకాశం ఉండగా, మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ వివరాల సేకరణ చేపట్టనున్నట్లు చెప్పారు.దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కల్పించడంలో జనాభా లెక్కలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితమైన సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ జనగణన డైరెక్టరేట్ అధికారులు కూడా ప్రజలు అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా స్వీయ గణన పూర్తి చేయవచ్చని తెలిపారు. సమర్పించిన సమాచారం గోప్యంగా ఉంటుందని, పూర్తి చేసిన వెంటనే ప్రత్యేక ఐడీ జారీ అవుతుందని వివరించారు.ప్రజల భాగస్వామ్యంతో జనగణనను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
