ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆన్లైన్ ద్వారా తన వివరాలను నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కీలక ప్రక్రియలో ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన వివరాలను నమోదు చేయడం ద్వారా దేశ అభివృద్ధి ప్రణాళికలకు తోడ్పడాలని సూచించారు.స్వీయ గణన విధానం, దాని ప్రాముఖ్యతపై సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. డిజిటల్ విధానంలో జనాభా లెక్కల నిర్వహణతో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్ ప్రియాంక తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగణనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.



