ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన కోలా శంకర్ గౌడ్ బలిదానం వృథా కాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన త్యాగంతోనే ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. నర్సంపేట డిపో వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ ఉద్యమ విజయానికి బీసీల పాత్ర కీలకమని తెలిపారు. శంకర్ గౌడ్ త్యాగం ప్రభుత్వాన్ని స్పందింపజేసిందని, జేఏసీతో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారానికి మార్గం సుగమం అయిందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా, ఇల్లు, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు.ఇలాంటి బలిదానాలు మళ్లీ జరగకూడదని, శంకర్ గౌడ్ త్యాగం చివరిదిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా కుటుంబానికి అండగా నిలవాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలు బీసీ సంఘాల నాయకులు, కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.
