ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే అనుమానంతో ప్రజలు భారీగా బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పలుచోట్ల బంకులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,500కు పైగా పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో దాదాపు 10 శాతం బంకులు స్టాక్ లేక తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం. సాధారణ రోజులతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ వినియోగం ఒక్కసారిగా గణనీయంగా పెరిగింది.సాధారణంగా రోజుకు విక్రయమయ్యే ఇంధన పరిమాణం కంటే 50 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ప్రజలు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో పాటు అదనంగా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆక్వా రంగానికి డీజిల్ సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని, ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు.పరిస్థితి నియంత్రణలోకి రావడానికి ప్రజలు సంయమనం పాటించడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
