ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాలపై మీడియాతో చిట్చాట్లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో పరోక్షంగా కల్వకుంట్ల కవితపై స్పందించారు.“ఉన్న పార్టీకే దిక్కులేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కొత్త పార్టీకి రాష్ట్రంలో ఏమాత్రం స్థానం లేదు” అని ఆయన అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మనుగడ కోల్పోయిందని, “శవాన్ని ఎంత అలంకరించినా ఉపయోగం ఉండదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి గతం ఉన్నా భవిష్యత్ లేదని స్పష్టం చేశారు.పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో పాలన సాగిందని ఆరోపించిన సీఎం, కేసీఆర్ కుటుంబానికి ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
