ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, ఈవీ వాహనాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మేలు చేసే సంస్కరణలను అమలు చేయడంలో టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సరఫరా లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుత విద్యుత్ వినియోగం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని అధికారులు వివరించారు. పారిశ్రామిక రంగంలో వినియోగం పెరగడం కూడా దీనికి కారణమని తెలిపారు.విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, యూనిట్ ధరను రూ.4.60కు తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇతర దేశాల్లో అమలవుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈవీలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంపుతో పాటు, కేంద్ర పథకాల అమలుపై కూడా సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద విద్యుత్ రంగంలో ఖర్చు తగ్గించి, సమర్థవంతమైన సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
