కరీంనగర్, ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందువల్ల ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించారు. 226 దరఖాస్తు వచ్చాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇప్పటికీ వారానికి మించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో పెండింగ్లో ఉన్న పలు శాఖలను గుర్తించి వెంటనే క్లియర్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు సంబంధిత శాఖకు బదిలీ కావడంలో ఆలస్యమైనా ప్రజావాణి ఆన్లైన్లో దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తుపై తీసుకున్న చర్య గురించి అర్జీదారునికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
