ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్-2 లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు చర్యలు వేగవంతం చేసింది.గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సుమారు 35,200 ఇళ్లను పూర్తి చేసి, వాటిని ఇందిరమ్మ పథకం కింద లబ్దిదారులకు అందించాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో ఎల్-2 లబ్దిదారులకు ఈ ఇళ్లను కేటాయించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ నాటికి లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం మంజూరైన 3.25 లక్షల ఇళ్లలో 2.66 లక్షల ఇళ్ల పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలని, సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.రెండో విడతలో పట్టణ ప్రాంత పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్లో ప్రభుత్వ భూములను గుర్తించి అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు స్థిర నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
