ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘స్పందన’ పోలీస్ టీమ్స్ను ప్రారంభించారు. ఐసీసీసీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్కతో కలిసి ఆయన ఈ ప్రత్యేక బృందాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలు, బాలికలు ఎదుర్కొనే వేధింపులు, హింస ఘటనల్లో తక్షణ స్పందన అందించడం ఈ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వెంటనే సహాయం అందించి రక్షణ కల్పించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.ప్రమాదం జరిగిన తర్వాత తొలి క్షణాలు (గోల్డెన్ అవర్స్) అత్యంత కీలకమని, ఆ సమయంలో వేగంగా స్పందిస్తే బాధితులకు కొత్త జీవితం ఇవ్వగలమని ఆమె పేర్కొన్నారు. మహిళా భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు వేగంగా పనిచేస్తున్నారని, నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.“న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే” అని స్పష్టం చేసిన మంత్రి, మహిళలకు తక్షణ న్యాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవ భావన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు అవసరమని సూచించారు. మహిళలు భయంలేకుండా జీవించే సమాజం నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం సాంకేతికతతో పాటు ప్రత్యేక బృందాల ఏర్పాటు కీలకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు.
