ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా ఎలా జరుగుతోందన్న విషయంపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు సరఫరా విధానం, నిల్వలు, పంపిణీ వ్యవస్థపై వివరాలు కోరారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో నిరంతర సరఫరా కొనసాగుతోందని, బంకులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనం అందిస్తున్నామని తెలిపారు.ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా వ్యవస్థను మరింత పటిష్టంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
