ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే షీ టీమ్స్, ‘స్టాండ్ విత్ హర్’ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అదే దిశగా ఇప్పుడు ‘స్పందన’ (తక్షణ రక్షణ) టీమ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు.‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ స్పందన వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసు అధికారులు, పీస్ కమిటీ సభ్యులతో సమావేశమై ఈ టీమ్స్ పనితీరుపై చర్చించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మహిళలు స్వయంగా నిలబడాలంటే వారికి భద్రత అత్యవసరమని అన్నారు. మహిళలు చదువు, ఉద్యోగం, వ్యాపారం స్వేచ్ఛగా కొనసాగించగలిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.స్పందన టీమ్స్ 24 గంటల పాటు పనిచేస్తూ, బాధితుల వద్దకు వెళ్లి తక్షణ సహాయం అందించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని తెలిపారు. మహిళలకు భరోసా కల్పించడం ఈ టీమ్స్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
మహిళలపై నేరాలను అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు, పీస్ కమిటీలు కూడా భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. అలాగే మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని హెచ్చరించారు.డ్రగ్స్ బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, సమాజంలో మత్తు సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.మహిళల ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుతో మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాలకు భారీ రుణ సౌకర్యాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలను ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
