ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచే అందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో Apollo Hospitals కొత్తగా ఏర్పాటు చేసిన “ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్”ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మరియు యాజమాన్యాన్ని అభినందించారు.వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, మెడికల్ టూరిజం వృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలతో నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.హైదరాబాద్ను ఫార్మా హబ్గా తీర్చిదిద్దిన విధానాలను గుర్తుచేస్తూ, ప్రస్తుతం దేశం నుంచి ఎగుమతి అవుతున్న బల్క్ డ్రగ్స్లో సుమారు 40 శాతం ఇక్కడి నుంచే వస్తున్నాయని చెప్పారు. వైద్య రంగంలో పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.అపోలో హాస్పిటల్స్ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిందని, అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ బ్రాండ్గా ఎదిగిందని సీఎం ప్రశంసించారు. త్వరలోనే 100 బ్రాంచ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగీతా రెడ్డి, శోభనా కామినేని, ఉపాసన కొణిదెల తదితరులు పాల్గొన్నారు.





