ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీబీఐ విచారణ చేపట్టేందుకు తక్షణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు సీబీఐకి లేఖ రాయాలని, అవసరమైతే సీబీఐ డైరెక్టర్ను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రం అందించాలని మంత్రులకు సూచించారు.ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలపై సీఎం, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయ నిపుణుడు అభిషేక్ సింఘ్వీతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని నివేదిక చెల్లుబాటులోనే ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై ఏ కోర్టులోనూ కేసులు పెండింగ్లో లేవని, సీబీఐ విచారణకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు.ఈ సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
