ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు లేఖ రాశారు.హైదరాబాద్లోని బీసీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో 53 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 68 శాతం బీసీలు గెలిచిన విషయాన్ని గుర్తుచేసిన కృష్ణయ్య, బీసీల సామర్థ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్లపై ఉన్న కోర్టు స్టేను ఎత్తివేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
