హైదరాబాద్, ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఖండించారు. తెలంగాణలో ఇంధన సరఫరా పూర్తిగా సక్రమంగానే కొనసాగుతోందని, ఎలాంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 రోజులపాటు సరిపడే ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అయితే, ఇటీవల ప్రజలు భయంతో అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలికంగా ‘నో స్టాక్’ పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించారు.పెట్రోల్ బంకుల వద్ద సాధారణం కంటే ఎక్కువ అమ్మకాలు నమోదవుతున్నాయని, దీనివల్ల సరఫరా–డిమాండ్ మధ్య తాత్కాలిక అసమతౌల్యం ఏర్పడుతోందన్నారు. బెంగాల్ ఎన్నికల అనంతరం ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం కారణంగా ప్రజలు ఎక్కువగా ఇంధనం నిల్వ చేసుకుంటున్నారని పేర్కొన్నారు.ఇటీవల ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో వ్యాపార వర్గాలు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు.ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో పరిస్థితిపై నిశితంగా నిఘా ఉంచుతున్నామని, ఎక్కడైనా సరఫరా లోపం ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ తాత్కాలిక సమస్య త్వరలోనే పూర్తిగా పరిష్కారమవుతుందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టీఫెన్ రవీంద్ర హామీ ఇచ్చారు.
