ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా చర్యలు వేగవంతం చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త దిశ, దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన పర్యాటక సలహా కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక కేంద్రాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలు, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను శక్తివంతమైన టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అవసరమైన కనీస సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేసిన మంత్రి, మరుగుదొడ్లు, తాత్కాలిక వసతి గదులు, టెంట్లు, గ్లాస్ హౌస్లు, రహదారి పక్క విశ్రాంతి కేంద్రాలు వంటి సదుపాయాలను తక్షణం మెరుగుపరచాలని సూచించారు. అమలు ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రతి ప్రాజెక్టుకు నోడల్ అధికారిని నియమించాలని అన్నారు.దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రారంభంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టి, భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యంతో స్వయం సమృద్ధిగా నడిచేలా చూడాలని సూచించారు.నగర సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో సమన్వయం చేస్తూ శిల్పాలు, ల్యాండ్స్కేపింగ్, స్కైవాక్లు వంటి ఆకర్షణీయ అంశాలను అభివృద్ధి చేయాలని మంత్రి పేర్కొన్నారు.రామప్ప ఆలయం, గోల్కొండ కోట, నాగార్జున సాగర్, యాదాద్రి దేవస్థానం వంటి కీలక పర్యాటక కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వారాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పర్యాటకులను ఆకర్షించాలని సూచించారు.
