ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆమె రాకతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.ఆలయానికి చేరుకున్న భువనేశ్వరిని అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేశం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.దర్శనం అనంతరం రంగమండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదం, శేష వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో స్వల్పంగా చర్చించినట్లు సమాచారం. వేసవి సెలవుల నేపథ్యంలో ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండటంతో, భువనేశ్వరి పర్యటన సమయంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు, భద్రతను మరింత బలోపేతం చేశారు. మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా ముగిసినట్లు అధికారులు తెలిపారు.
