ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. కే. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, “సారు బయటకు రారు, ఎవరినీ కలవరు” అన్న కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హమని అన్నారు.ఒకవైపు తమ నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు వస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎలా సమంజసం అవుతుందో బీఆర్ఎస్ చెప్పాలని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. రైతు సంక్షేమంపై ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ‘తరుగుతో’ పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో చెక్కులు పంచుతూ, తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేశారని కూడా విమర్శించారు.గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రైతుల కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని, రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.ఈ వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత ముదురుతున్నది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.
