ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరుగుతాయన్న ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ఇంధన ధరలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు స్పష్టతనిస్తూ కేంద్రం భరోసా ఇచ్చింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్, LPG, PNG దిగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ధరలు పెంచే ఆలోచన కూడా ప్రస్తుతం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.కేంద్రం తీసుకుంటున్న చర్యలతో దేశంలో ఇంధన సరఫరా స్థిరంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా, దేశీయంగా ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
