ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కోతలు వేగంగా కొనసాగుతున్నందున డీజిల్ డిమాండ్ ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. మరోవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోతలు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు.పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెరగడం, ట్యాంకర్ల ఆలస్యం, హార్వెస్టర్ల మార్పిడి వంటి కారణాలతో డీజిల్ అవసరం అకస్మాత్తుగా పెరుగుతోందని గుర్తించామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లు పంపడం, కీలక బంకుల్లో ముందస్తు నిల్వలు ఉంచడం, హార్వెస్టర్లకు ప్రత్యేక క్యూ, టోకెన్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డీజిల్ సరఫరా కూడా చేపట్టాలని సూచించారు.వాతావరణ మార్పులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కోతకు వచ్చిన వరి తడిసిపోకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, అగ్రికల్చర్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.సివిల్ సప్లైస్ శాఖతో సమన్వయం పెంచి టార్పాలిన్లు తక్షణం అందించడంతో పాటు ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు కొనసాగించి ఎక్కడా డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే రెండు నుంచి మూడు వారాలు కీలకమైనవని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోతలు సజావుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
