ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అజ్ఞాత జీవితం వీడి సాధారణ జీవనంలోకి రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని సమాజంలో భాగస్వామ్యం చేసే దిశగా ముందడుగు వేసింది.ఈ నేపథ్యంలో తొలి విడతగా 20 మంది గిరిజన యువతను ‘గిరిదర్శక్’లుగా (టూరిస్ట్ గైడ్స్) నియమించింది. భారత్ ఫ్యూచర్ సిటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు.పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంపికైన ఈ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పోలీసు, గిరిజనాభివృద్ధి, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో వారికి పర్యాటకులకు మార్గనిర్దేశం చేసే విధంగా తీర్చిదిద్దారు.భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో వీరు సేవలు అందించనున్నారు. పర్యాటకులకు స్థానిక సంస్కృతి, చరిత్ర వివరాలు తెలియజేయడంతో పాటు, అటవీ నియమాలు పాటించేలా చూడటం, భద్రత పరంగా సహకరించడం వీరి బాధ్యతగా ఉంటుంది.ఒకప్పుడు అడవుల్లో మావోయిస్టులకు మార్గం చూపిన ఈ యువత, ఇకపై పర్యాటకులకు దారి చూపించబోతుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తెచ్చింది. వారిలో ఆత్మవిశ్వాసం పెంచి, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇక, ఎంపికైన గిరిదర్శక్లకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఆరు నెలలపాటు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. శిక్షణ కాలంలో వారికి స్కాలర్షిప్ కూడా అందించనున్నారు.ములుగు, భద్రాద్రి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో, స్థానిక గిరిజన యువతను ఉపాధితో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.




