ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రభుత్వ నియంత్రణలోకి రానుంది.ఈ నేపథ్యంలో షేర్ పర్చేస్ అగ్రిమెంట్ (SPA)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్అండ్టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. ఈ ఒప్పందంతో ప్రైవేటు సంస్థ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధ్యక్షతన జరిగిన హెచ్ఎంఆర్ఎల్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో ఒప్పంద ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.ఎల్అండ్టీ మెట్రోరైలు లిమిటెడ్కు ఉన్న సుమారు ₹13,615 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అప్పును తక్కువ వడ్డీతో పునర్వ్యవస్థీకరించేందుకు ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం పొందే యోచనలో ఉంది.అలాగే హెచ్ఎండీఏ నుంచి ₹1,385 కోట్లను ఈక్విటీ రూపంలో ఎల్అండ్టీకి చెల్లించనున్నారు. ఈ చర్యలతో ఒప్పందం పూర్తయిన తర్వాత మెట్రో నిర్వహణ, విస్తరణపై ప్రభుత్వానికి నేరుగా నియంత్రణ లభించనుంది.ఈ మార్పుతో ప్రయాణికులకు మెరుగైన సేవలు, టికెట్ ధరల నియంత్రణ, కొత్త మార్గాల అభివృద్ధిపై త్వరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నగర ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా మెట్రోను మరింత బలోపేతం చేసే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
