ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చైల్డ్ సేఫ్టీ – ప్రొటెక్షన్ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆఫ్టర్కేర్ పిల్లలకు కీలక ధ్రువపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని తెలిపారు. వారి ఉన్నత విద్య, ఉపాధి కోసం అవసరమైన అన్ని సర్టిఫికెట్లను ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. గతంలో ధ్రువపత్రాల కోసం ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొన్నారు. “ఈ సర్టిఫికెట్లు మీ భవిష్యత్తుకు బాటలు వేసే సాధనాలు” అని విద్యార్థులకు ఉత్సాహం కలిగించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సందేశమిచ్చారు. క్రీడల ప్రాధాన్యతను వివరించి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే వేలాది ధ్రువపత్రాలు అందజేశామని, మిగతా ప్రక్రియలు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, బాలల భద్రత, పునరావాసం, విద్య, మహిళల సాధికారతపై ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో 1055 మంది ఆఫ్టర్కేర్ పిల్లలకు ఆధార్, ఆదాయ, నివాస, కుల ధ్రువపత్రాలు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో అధికారులు, కమిషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
