ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు వివాదం న్యాయస్థానానికి చేరింది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన సుమారు 23 వేల మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రభుత్వ జీవో అమలులో లోపాల వల్ల అర్హులైన రైతులు నష్టపోతున్నారని, దీంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని తక్షణ పరిష్కారం కోసం కోర్టు జోక్యం అవసరమని హరీశ్రావు తరఫు న్యాయవాది విన్నవించారు. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ అంశం ప్రజాప్రయోజనానికి సంబంధించినదని, పిటిషన్ను ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL)గా దాఖలు చేయాలని సూచించారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది వ్యక్తిగత సమస్య కాదని, ప్రజల సమస్య కాబట్టి PIL రూపంలో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.దీంతో కోర్టు సూచన మేరకు హరీశ్రావు తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. త్వరలోనే ఈ అంశంపై కొత్తగా పిల్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
