ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి రూ.2,540 కోట్ల భారీ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అమరావతిలో కృష్ణానది వరద నియంత్రణ పనులు, సచివాలయం గ్లాస్ క్లాడింగ్ వంటి అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు కూడా సమ్మతి తెలిపింది.పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంపు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం రూ.798 కోట్లు, ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల కోసం రూ.580 కోట్ల ప్రణాళికలకు కూడా ఆమోదం లభించింది.విద్యుత్ మౌలిక సదుపాయాల భాగంగా 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులకు రూ.1,180 కోట్లు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్కు భూమి కేటాయించగా, ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు మంజూరు చేశారు.అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోట్ చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
