ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో కీలక సూచనలు చేశారు. రాజధాని అమరావతిపై ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు ఆదేశించారు.సింగపూర్లో మంత్రుల శిక్షణపై వస్తున్న విమర్శలను ఖండించాలని సీఎం పేర్కొన్నారు. పరిపాలన మెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ పర్యటన జరిగిందని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణాలను తక్కువ ఖర్చుతోనే చేపడుతున్నామని తెలిపారు.అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణంలో ఉన్నాయని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుల ప్రత్యేకతలను ప్రజలకు వివరించాలని మంత్రులను సూచించారు.ఇంధన కొరత అంశంపై కూడా సీఎం స్పందించారు. ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అలాగే సింగపూర్ పర్యటనలో నేర్చుకున్న విషయాలను ఇతర మంత్రులతో పంచుకోవాలని, త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.
