ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుభిక్షం కోసం మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పేర్లపై ప్రత్యేకంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.కారకంపాడులోని తన స్వగ్రామంలో ఈ యాగాన్ని ఘనంగా నిర్వహించిన మంత్రి, పెద్ద ఎత్తున హోమగుండం ఏర్పాటు చేసి పండితులతో శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యాగంలో భక్తులు, స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు భారీగా పాల్గొన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి విజయాలు చేకూరాలని మంత్రి ప్రార్థించారు. యాగం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.హిందూ సంప్రదాయాల ప్రకారం రాజశ్యామల యాగం జ్ఞానం, కీర్తి, విజయాలను ప్రసాదించే పవిత్ర క్రతువుగా భావిస్తారు. జ్ఞాన సరస్వతి రూపమైన రాజశ్యామల దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు.
